Pakistan: అనవసరంగా ఆఫ్ఘానిస్తాన్లోని తాలిబాన్లను పాకిస్తాన్ పెట్టుకుంది. ఇప్పుడు అనుభవిస్తోంది. తాలిబాన్లు పాకిస్తాన్కు దళాలకు చుక్కలు చూపెడుతున్నారు. పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘాన్లోని తాలిబాన్ సర్కార్ సహాయం చేస్తుందని చెబుతూ, పాక్ ఆ దేశ రాజధాని కాబూల్తో సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు చేసి, సాధారణ ప్రజల్ని హతమారుస్తోంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ బలగాలు కూడా అంతే ధీటుగా పాక్పై విరుచుకుపడుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్లపై పడింది. తాలిబాన్ దాడుల నేపథ్యంలో ఆదివారం నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరుగుతాయని తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు,ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్పై జరుగుతున్న నిరంతర దాడుల కారణంగా తలెత్తిన భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
PSL 2026 మార్చి 26న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సారి కేవలం రెండు నగరాల్లో మాత్రమే ఈ టోర్నీ మ్యాచ్లు జరుగుతాయి. కేవలం కరాచీ, లాహోర్లోనే మ్యాచులు నిర్వహించనున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు స్టేడియాలకు ప్రేక్షకుల్ని అనుమతించబోమని పీసీసీ ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ విలేకరుల సమావేశంలో చెప్పారు. దీంతో పాటు పీఎస్ఎల్ ఓపెనింగ్ సెరమని కూడా జరగదని ఆయన స్పష్టం చేశారు.
“PSL మా అంతర్జాతీయ బ్రాండ్, ఇందులో అనేక మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. మేము ఈ టోర్నమెంట్ను రద్దు చేయలేము. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, 25,000 నుండి 30,000 మంది ప్రజలను స్టేడియాల్లోకి అనుమతించడం సాధ్యం కాదు.ఈ నిర్ణయం తీసుకునే ముందు, పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, భద్రతా సంస్థలతో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించాము” అని ఆయన వివరించారు. దేశ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.
ఈ ఏడాది పీఎస్ఎల్ టోర్నీలో మొత్తం 44 మ్యాచ్లు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 8 జట్లు-హైదరాబాద్ కింగ్స్మెన్, ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి పిండిస్ జట్లు పాల్గొంటున్నాయి.
