NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌లో మారణహోమం.. వేర్వేరు ఘటనల్లో 18 మంది మృ‌తి..

Pakistan

Pakistan

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరసగా తీవ్రవాద దాడులతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో మిలిటెంట్లు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది మరణించారు. ఇందులో ఆరుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. 12 మంది ఉగ్రవాదులు ఉన్నారు. సీనియర్ పోలీస్ అధికారితో సహా ఆరుగురు పోలీసులు మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. బలూచిస్తాన్ ప్రావిన్సులో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ సాయుధ దళాల మీడియా విభాగం తెలిపింది.

ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని కులాచీ తహసిల్‌లోని కోట్ సుల్తాన్ ప్రాంతంలో భద్రతా దళాల కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని లక్కీ మార్వాత్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒక సాయుధ దుండగుడు, డీఎస్పీ, ఇద్దరు పోలీసులు మరణించగా ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.

Read Also: Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..

రంజాన్ పండగ సందర్భంగా పోలీస్ భద్రత తనిఖీల్లో భాగంగా రద్దీగా ఉండే పెషావర్-కరాచీ హైవేపై డీఎస్పీ గుల్ మహ్మద్, ఇతర పోలీసులతో కలిసి తాత్కాలిక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారు చెక్ పాయింట్ నుంచి తిరిగి వస్తుండగా.. మంజివాల చౌక్ సమీపంలో పోలీస్ వ్యాన్‌‌పై సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో డీఎస్పీతో సహా పలువురు పోలసీులు మరణించారు.

లక్కీ మార్వాట్‌లో పోలీసులపై జరిగిన దాడిని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదుల పిరికి చర్యగా అభివర్ణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ గుండాపూర్ కూడా తీవ్రవాద దాడిని ఖండించారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌‌లో అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్న తర్వాత రెండు దేశాల సరిహద్దులో ఉండే ఈ ప్రావిన్సు తీవ్రవాద దాడుల్ని ఎదుర్కొంటోంది. పాక్ తాలిబాన్లు ఆర్మీ, పాక్ పోలీసులు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇదే విధంగా దాడులు జరుపుతోంది.