UPI At France: ఇతర దేశాలకు వెళితే మన రూపాయి చెల్లుబాటుకాకపోవడంతో.. మన కరెన్సీని అక్కడి స్థానిక కరెన్సీలోకి మార్చుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక ఫ్రాన్స్ కి వెళ్లిన వారు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇకపై పారిస్లో మన రూపాయి చెల్లుబాటు కానుంది. అలాగే ఫ్రాన్స్ లో మన యూపీఐ సేవలు కొనసాగనున్నాయి. దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులదే హవా. నగదు లావాదేవీలకు బదులు డిజిటల్ సాంకేతికతపై ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. దీనికి నిదర్శనం గతేడాది ప్రపంచంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ తొలి స్థానంలో నిలవడం. సరికొత్త ఆవిష్కరణలు, దేశం నలుమూలలా వినియోగంతో భారత్ నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో యూపీఐ సేవలను విదేశాలకు విస్తరించే పనిలో కేంద్రం నిమగ్నమై ఉంది. ఫ్రాన్స్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ పారిస్లోని ప్రవాసీ భారతీయులతో గురువారం సమావేశమయ్యారు. భారత్లో విజయవంతంగా అమలవుతున్న నగదు చెల్లింపుల వ్యవస్థ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’(UPI) సేవలు ఇక ఫ్రాన్స్లోనూ ప్రారంభం కానున్నాయని మోడీ తెలిపారు. ‘ఫ్రాన్స్లో యూపీఐ చెల్లింపుల సేవలను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.. త్వరలోనే ఈఫిల్ టవర్ (Eiffel Tower) వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయి.. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే భారత పర్యాటకులు భారత కరెన్సీని ఇక్కడ చెల్లింపుల కోసం వాడవచ్చు’ అని ప్రధాని పేర్కొన్నారు.
Read also: Viajy Devarakonda : ఆరాధ్య సాంగ్ నా మనసుకు ఎంతగానో నచ్చింది..
ఫ్రాన్స్లో యూపీఐను అనుమతించడం వల్ల భారతీయులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. గజిబిజిగా ఉన్న ఫారెక్స్ కార్డ్లు వినియోగం, నగదును తీసుకెళ్లాల్సిన అవసరాన్ని నివారిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) 21 బ్యాంకులతో కలిసి ఈ వ్యవస్థను 2016 ఏప్రిల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు దేశంలో విశేషంగా ప్రాధాన్యం పొందాయి. యూఏఈ, భూటాన్, నేపాల్లో వంటి దేశాల్లోనూ యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. గతేడాది ఎన్పీసీఐ, ఫ్రాన్స్లు ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థ లైరా అని పిలిచే ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అలాగే ఈ ఏడాది యూపీఐ, సింగపూర్కి చెందిన PayNow మధ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల్లోని వినియోగదారులు దీని ద్వారా లావాదేవీలకు అనుమతించారు. అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఎన్పీసీఐ చర్చలు జరుపుతోంది.