ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్ప్లస్లకు ఊహించని షాక్ తగిలింది. ఓ విషయమై నోకియా దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జర్మనీలోని మాన్హీమ్ కోర్టు.. ఆ రెండు కంపెనీలపై వేటు వేసింది. నోకియాకి అనుకూలంగా తీర్పునిస్తూ.. ఆ దేశంలో ఒప్పో, వన్ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..
5జీ నెట్వర్క్లోని పలు టెక్నాలజీలపై ‘నోకియా’ పేటెంట్ కలిగి ఉంది. అయితే.. వాటిల్లోని ఓ టెక్నాలజీని ఒప్పో, వన్ప్లస్ సంస్థలు ‘నోకియా’ అనుమతి తీసుకోకుండా వినియోగించాయి. దీనిపై మూడు సంస్థల మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ, అవి విఫలం కావడంతో నోకియా న్యాయపరమైన పోరాటానికి దిగింది. పలు దేశాలలో ఆ కంపెనీలపై కోర్టులో దావా వేసింది. ఈ నేపథ్యంలోనే జర్మనీ కోర్టు ఒప్పో, వన్ప్లస్కి ఝలకిస్తూ.. ఆ రెండు సంస్థల ఫోన్లను బ్యాన్ చేసింది. నోకియాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మొత్తం మూడు ప్రాంతీయ జర్మనీ కోర్టులలో నోకియా దావా వేయగా.. మాన్హీమ్ కోర్టు మొదటి తీర్పునిచ్చింది. అంటే, ఇంకా రెండు కోర్టుల నుంచి తీర్పు రావాలి.
కాగా.. సుమారు $130.3 బిలియన్ల భారీ పెట్టుబడులతో 5G స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్ల(SEP) విభాగంలో నోకియా నాయకత్వం వహిస్తోంది. వీటితోపాటు ఈ రంగంలో ఇంకా మరెన్నో పేటెంట్లను నోకియా సొంతం చేసుకుంది. అయితే.. యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్ప్లస్ కంపెనీలపై నోకియా దావా వేసింది. మరి, మాన్హీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఒప్పో, వన్ప్లస్ సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.