Site icon NTV Telugu

Trump-Iran: నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు.. పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్

Iran

Iran

అమెరికా-ఇరాన్ మధ్య మంగళవారం కీలక చర్చలు జరగనున్నాయి. మరోసారి అణు ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఇరు దేశాల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ జెనీవాకు చేరుకున్నారు. మంత్రితో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వెళ్లింది. అమెరికా బృందం కూడా చేరుకుంది. ఈ చర్చల్లో పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే చర్చలకు ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. క్షిపణి కార్యక్రమంపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తొలి విడత చర్చలు ఒమన్‌లో జరిగాయి. అప్పుడు పెద్ద పురోగతి లభించలేదు. ఈసారైనా ఫలిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ చర్చలు కొలిక్కి రాకపోతే మాత్రం మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.

సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి జెనీవాలో యూఎన్ అణు వాచ్‌డాగ్ అధిపతితో సమావేశమయ్యారు. చర్చలకు ముందు సమావేశం జరిగినప్పటికీ అణు ఒప్పందంపై నిర్దిష్ట చర్యలు తీసుకున్నట్లు ఇరువైపుల నుంచి స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు. ఇక చర్చలను అణు వరకే పరిమితం చేయాలని ఇరాన్ పట్టుబడుతున్నట్లు కనిపిస్తోంది. క్షిపణితో పాటు ఇతర అంశాలపై చర్చించబోమని చెబుతున్నట్లుగా సమాచారం. జీరో-యురేనియం సుసంపన్నం, ఇతర కార్యక్రమాలపై చర్చించబోమని ఇరాన్ స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవాలో జరిగే చర్చలు కూడా ఫలిస్తాయో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు అరేబియా సముద్రంలో మోహరించాయి. ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఇరాన్‌లో అశాంతి నెలకొనే పరిస్థితులు ఉంటాయి.

Exit mobile version