పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న తరుణంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లను నియంత్రించాలని ప్రయత్నం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని రూబియో వార్నింగ్ ఇచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. అంతర్జాతీయ జలాల్లో ఎవరు ప్రయాణించాలో ఇరాన్ నిర్ణయించే అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రూబియో తేల్చి చెప్పారు.
హార్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచంలో పెద్ద మొత్తంలో చమురు, సహజ వాయువు ఈ మార్గం గుండానే వెళ్తుంది. అయితే గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయడంతో అప్పటి నుంచి హార్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తోంది. హార్ముజ్ను తన కంట్రోల్ పెట్టుకుంది. దీంతో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి.. ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కో రూబియో ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికాకు హార్ముజ్ జలసంధి మార్గంపై ఆధారపడే శాతం చాలా తక్కువ అని.. ఏదైనా జరిగితే ఇరాన్కే నష్టం అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ మార్గంపై ఆధారపడతాయని పేర్కొన్నారు.
ఇరాన్పై ప్రధాన లక్ష్యాలను రూబియో వెల్లడించారు.
1. ఇరాన్ వైమానిక దళాన్ని బలహీనపరచడం
2. నౌకాదళాన్ని ధ్వంసం చేయడం
3. క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని తగ్గించడం
4. రక్షణ పరిశ్రమలను దెబ్బతీయడం
ఈ లక్ష్యాలను కొన్ని వారాల్లోనే సాధించవచ్చని రూబియో పేర్కొన్నారు. అమెరికా ఎప్పుడూ సమస్యలను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని కోరుకుంటుందని తెలిపారు. అవసరమైతే సైనిక చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Iran-US: భారత్కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి