First Hindu Woman In Pak To Become A Senior police officer: పాకిస్తాన్ వంటి ముస్లిం దేశంలో హిందువుల భవితే ప్రశ్నార్థకం అవుతోంది. ప్రస్తుతం పాక్ సమాజంలో హిందువులను చిన్నచూపు చూస్తుంటారు. ఒకప్పుడు గణనీయంగా ఉండే హిందువులు ప్రస్తుతం 2 శాతానికి పడిపోయారు. నిత్యం కిడ్నాపులు, మతమార్పిడిలు, పెళ్లిళ్లతో హిందువులను వేధిస్తుంటుంది అక్కడి సమాజం. అయితే ఓ హిందూ మహిళ మాత్రం పాకిస్తాన్ లో రికార్డ్ సృష్టించింది. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ సూపరింటెండెంట్ పదవిని అందుకుంది. పాకిస్తాన్ హిందూ మహిళ మనీషా రోపెటా ఈ స్థానానికి చేరిన తొలి హిందు మహిళగా చరిత్రకెక్కింది.
పురుషాధిక్యత, మత ప్రభావం ఎక్కువగా ఉండే పాకిస్తాన్ వంటి దేశంలో ఓ హిందూ మహిళ ఈ స్థానానికి చేరుకోవడం అంటే అంత సులభం కాదు. 26 ఏళ్ల మనీషా రోపేట మాత్రం హిందువులకే కాకుండా మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నప్పటి నుంచి పితృస్వామ్య వ్యవస్థను చూశానని.. పాకిస్తాన్ లో అమ్మాయిలు చదువుకోవడం అంటే డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని.. మనీషా రోపేటా అన్నారు. సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా.. పోలీస్ వంటి శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు వెల్లడించారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని.. వారికి అండగా నిలబడాలనే పోలీస్ ఉద్యోగం సంపాదించానని చెబుతున్నారు.
Read Also: Rashtrapatni Row: కాంగ్రెస్ ఎంపీకి మహిళా కమిషన్ నోటీసులు..
మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా రోపేటా తండ్రి వ్యాపారం చేసేవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించడంతో.. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను పెంచించింది. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో నిలిచిన మనీషా రోపేటా డిఎస్పీ స్థానాన్ని అధిరోహించింది. ప్రస్తుతం మనీషా, నేరాలు అధికంగా ఉండే లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.