Iranian Killed For Celebrating FIFA World Cup Loss to United States: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. ఇటీవల అమెరికా చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో అక్కడి ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా తమ దేశం గెలిస్తే సంబరాలు చేసుకునే ప్రజలు, ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు. మహ్సఅమిని పోలీస్ కస్టడీలో చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇరాన్ జట్టు ఫిఫాలో మ్యాచులు ఆడేందుకు వెళ్లడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవడంతోనే ఇరాన్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు ఇరాన్ ప్రజలు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్పై పెదవి విప్పిన పాక్ బౌలర్ హారీస్ రౌఫ్..
మంగళవారం రాత్రి ఖతార్లో జరిగిన ప్రపంచ కప్లో ఇరాన్ను యునైటెడ్ స్టేట్స్ ఓడించింది. ఇదిలా ఉంటే ఈ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపాయని హక్కుల సంఘాలు బుధవారం తెలిపాయి. టెహ్రాన్కు వాయువ్యంగా కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న బందర్ అంజాలి అనే నగరంలో మెహ్రాన్ సమక్ (27) కాల్చిచంపినట్లు ఓస్లోలోని ఇరాన్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. తలపై కాల్చి సమక్ ను చంపినట్లు తెలిపింది. హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న నిరసనకారులు ఈ ఓటమిపై సంబరాలు చేసుకున్నారు. ఈ నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తోంది ఇరాన్.
గత రెండు నెలలుగా ఇరాన్ వ్యాప్తంగా యాంటీ హిజాబ్ నిరసనలు జరుగుతున్నాయి. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని అక్కడి మోరాలిటీ పోలీసులు హిజాబ్ ధరించలేదని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆ యువతి చనిపోవడంతో అక్కడ ఉద్యమం ప్రారంభం అయింది. యువత, మహిళలు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా యాంటీ హిజాబ్ అల్లర్లలో 448 మంది చనిపోయారు.