Iran War Impact on Pakistan: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ప్రారంభమై.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింఇ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లో పరిస్థితి మరింత సంక్షోభంగా మారింది. ఇరాన్కు సంబంధించిన యుద్ధ పరిణామాలు అక్కడి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్, ఇప్పుడు ఇంధన ధరల పెరుగుదలతో మరింత కష్టాల్లో పడింది. దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పెట్రోల్ ధర రూ.321కి పెరుగుదల
యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పాకిస్తాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గతంలో లీటరుకు రూ.266.17గా ఉన్న పెట్రోల్ ధరను ప్రభుత్వం రూ.55 పెంచడంతో ఇప్పుడు అది రూ.321.17కు చేరుకుంది. హై-స్పీడ్ డీజిల్ ధర కూడా లీటరుకు రూ.335.86కు పెరిగింది. అదేవిధంగా LPG ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం 14.2 కిలోల LPG సిలిండర్ ధర దాదాపు రూ.1,046కి చేరుకుంది. దీంతో సాధారణ ప్రజల జీవన వ్యయం మరింత పెరిగింది.
చమురు సరఫరా సమస్యలు
పాకిస్తాన్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతి చేసే చమురు మరియు గ్యాస్పై ఎక్కువగా ఆధారపడుతుంది. ముఖ్యంగా Strait of Hormuz మార్గం ద్వారా వచ్చే చమురు సరఫరా కీలకం. అయితే యుద్ధ ప్రభావంతో ఆ సరఫరా అంతరాయం కలగడంతో దేశం తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం పాకిస్తాన్ నెలవారీ చమురు దిగుమతి బిల్లు సుమారు 600 మిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తోంది. మరోవైపు.. ఇంధన ధరల పెరుగుదలతో పాటు కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి ఇంధనం నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి.
విమాన ప్రయాణం కూడా ఖరీదు
ఇంధన ధరలు పెరగడంతో విమాన టిక్కెట్ల ధరలు కూడా పెరిగాయి. దేశీయ విమాన ప్రయాణ టిక్కెట్లు సుమారు PKR 2,800 వరకు పెరిగాయి. గతంలో PKR 10,000 నుంచి 15,000 మధ్య ఉన్న టిక్కెట్లు ఇప్పుడు PKR 17,000 నుంచి 20,000 వరకు చేరుకున్నాయి.
సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ చర్యలు
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజుల పని విధానం తీసుకొచ్చింది.. 50శాతం ఉద్యోగులు రొటేషన్ ప్రాతిపదికన ఇంటి నుంచే పని చేయిస్తోంది.. ప్రైవేట్ సంస్థలకు కూడా వర్క్ ఫ్రం హోమ్ సూచనలు చేశారు.. కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు రెండు నెలల పాటు జీతాలు తీసుకోకూడదని నిర్ణయం తీసుకుంది సర్కార్.. మరోవైపు.. ప్రస్తుతం దేశంలో సుమారు 28 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే యుద్ధ పరిస్థితులు కొనసాగితే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.