UAE-Iran: బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంలో యూఏఈ కీలక భాగస్వామి అని అన్నారు. ఇరాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో తాను యూఏఈలో రహస్య పర్యటన చేసి, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కలిశానని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రకటించిన తర్వాత అరఘ్చి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇజ్రాయిల్ పొత్తు కూడా మిమ్మల్ని కాపాడలేకపోయిందని, ఇరాన్ పట్ల మీ విధానాన్ని పున:సమీక్షించుకోండి అంటూ యూఏఈకి వార్నింగ్ ఇచ్చారు.
Read Also: PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యాఖ్యల్ని యూఏఈ ఖండించింది. ఇది పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి రక్షణ కోసం యూఏఈ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయిల్కు చెందిన కీలక గూఢచార సంస్థల అధిపతులు కూడా రహస్యంగా యూఏఈలో పర్యటించినట్లు బుధవారం నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయిద్, ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహూలు మార్చి 26న ఒమన్ సరిహద్దు సమీపంలోని అల్ ఐన్ నగరంలో కలుసుకున్నారని, గంటల పాటు సమావేశం జరిగిందని చెబుతున్నాయి.
నెతన్యాహూ యూఏఈ పర్యటన తమకు తెలుసని ఇరాన్ యూఏఈకి వార్నింగ్ ఇచ్చింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఎక్స్లో.. ఇరాన్ భద్రతా సంస్థలు చాలా కాలం క్రితమే మా నాయకత్వానికి తెలియజేసిన విషయాన్ని ఇప్పుడు నెతన్యాహూ బహిరంగంగా అంగీకరించాడని అన్నారు. ఇరాన్ ప్రజలు ఆగ్రహానికి గురికావడం అవివేకం, జూదం లాంటిదని, మాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్తో కలిసి పనిచేయడం క్షమించరానిదని అన్నారు.
