Iran War: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ తహతహలాడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగేందుకు ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయనే నివేదికలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ చేతిలో పాకిస్తాన్ను అవమానం తప్పలేదు. పాకిస్తాన్కు వెళ్తున్న ఒక కంటైనర్ షిప్ను హార్ముజ్ జలసంధి దాటకుండా ఇరాన్ దళాలు నిలిపేశాయి. యూఏఈ షార్జా నుంచి కరాచీ వైపు వెళ్తున్న ఈ నౌకను నిలిపేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది.
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఈ జలసంధి ద్వారానే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచంతో కలుస్తోంది. అయితే, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. ప్రపంచ ఇంధన సరఫరాకు ఈ జల మార్గమే కీలకం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు ఈ జలసంధి గుండా వెళుతుంది. యుద్ధం మొదలైన తర్వాత ఈ మార్గంలో వెళ్తున్న ట్యాంకర్లను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. దీంతో నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం, హార్ముజ్ జలసంధి గుండా అనుమతి లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల ‘‘సెలెన్’’ అనే కంటైనర్ నౌకను ఇరాన్ తిప్పి పంపించిందని ఐఆర్జీసి నేవీ కమాండర్ అలీ రెజా తంగ్సిరి వెల్లడించారు. ఈ మార్గం గుండా ఏ నౌక ప్రయాణించడానికైనా ఇరాన్ అనుమతి, సమన్వయం అవసరమని చెప్పారు. హార్ముజ్ గుండా స్వేచ్ఛాయుత నౌకయానాన్ని తామే నిర్వహిస్తామని ఇరాన్ ప్రకటించింది. శత్రువులతో సంబంధం లేని నౌకల్ని అనుమతిస్తున్నాట్లు ఇరాన్ ఇటీవల ప్రకటించింది.
