మధ్యప్రాచ్యం యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. టెలివిజన్లో కీలక ప్రసంగం చేశారు. పక్క దేశాలపై దాడులు చేయబోమని తెలిపారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు దేశాలకు కూడా క్షమాపణలు చెప్పారు. ‘‘మా జోలికి రాకుంటే.. మీ జోలికి రాబోం.. ఇజ్రాయెల్, అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు.’’ అని తేల్చి చెప్పారు. లొంగిపోవాలని కలలు కనే వారు కచ్చితంగా విఫలమవుతారన్నారు.
ప్రసంగ సమయంలో మసౌద్ పెజెష్కియన్ శాంతి హస్తాన్ని చూపారు. ఇరాన్ శాంతిని ప్రేమించే దేశమని.. ప్రాంతీయ స్థిరత్వం కోసమే సైనిక చర్యను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన సార్వభౌమాధికారంపై దృఢమైన వైఖరిని తీసుకున్నట్లు వివరించారు.
ఇదిలా ఉంటే పెజెష్కియన్ టెలివిజన్ ప్రసంగానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా మద్దతు ఇస్తుందని పుతిన్ వెల్లడించారు. ఏదైనా సమస్యను బలవంతంగా కాకుండా చర్చలు.. దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
అయితే అంతర్జాతీయ ఒత్తిడితోనే ఇరాన్ వైఖరి మారినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ భయాలు తారాస్థాయికి చేరడంతో ఇరాన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.