Iran: ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో పూర్తవుతోంది. మరోసారి గడువు పెంచేది లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో అమెరికా, ఇరాన్ విషయంలో ఏం చేస్తుందని ప్రపంచమంతా భయాందోళనకు గురవుతోంది. ఇరాన్ డీల్ చేసుకోకపోతే తీవ్రమైన దాడులు చేస్తామని, బ్రిడ్జ్లు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా దాడుల కోసం సిద్ధమవుతోంది. ఇరాన్ కీలక విద్యుత్ కేంద్రాల వద్ద ‘‘మానవ గొలుసు(హ్యూమన్ చైన్)’’ ఏర్పాటు చేయాలని తన ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులతో సహా దేశ యువతను మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటల (స్థానిక సమయం) నుండి ఆ ప్రదేశాల చుట్టూ గుమిగూడాలని ఇరాన్ క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
Read Also: Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఇచ్చిన గడువు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలతో ముగుస్తోంది. ఈ మావన కవచాలు అనే ఆలోచన స్వయంగా యువత ఇచ్చిందే అని ఇరాన్ మంత్రి అలీ రెజా రహీమీ ఒక వీడియోలో చెప్పారు. దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ ఒక మానవ కవచం ఏర్పాటు చేయాలని పలువురు యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిపాదించారని అన్నారు. ఇలా దేశ మౌలిక సదుపాయాలను రక్షిస్తామని ఆయన చెప్పారు.
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను ఒక రోజులో నాశనం చేయగలని, ఆ రోజు రేపే కావచ్చని హెచ్చరించారు. ఇకపై ఇరాన్కు గడువు పెంచేది లేదని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛా వాణిజ్యం కోసం తెరవాలని లేకపోతే నాశనమవుతారని హెచ్చరికలు జారీ చేశారు.