Srisailam: నంద్యాల జిల్లాలోని పవిత్ర క్షేత్రం.. జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన.. మహాశక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న శ్రీశైలం క్షేత్రంలో నేడు శ్రీ భ్రమరాంబికా అమ్మవారి వార్షిక కుంభోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తొలి విడత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మకాయలు, గుమ్మడికాయలను సమర్పిస్తారు. ఈ పూజలు శాస్త్రోక్తంగా జరుగుతుండగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందనున్నారు.
Read Also: Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన
ఇక, సాయంకాలం శ్రీస్వామివారికి అన్నాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అన్నాన్ని కుంభరాశిగా పోసి, ఆలయ ఉద్యోగి గోవింద్ స్త్రీ వేషంలో అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అమ్మవారికి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన సమర్పిస్తారు. కుంభహారతి అనంతరం రెండో విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలను సమర్పిస్తారు. ఈ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక భక్తులకు అమ్మవారి నిజారూప దర్శనానికి అనుమతి ఇవ్వబడుతుంది. ఈ కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలానికి భారీగా భక్తులు తరలి వస్తుండగా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.