Iran: సిరియా డమాస్కస్పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఖుద్ ఫోర్స్కి చెందిన టాప్ కమాండర్, మరో ఆరుగురు కీలక అధికారులు మరణించడం ఇరాన్ కోపానికి కారణమైంది. తాము ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు.
Read Also: MI vs RCB: మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ చిలిపి పనులు..! వీడియో వైరల్
ఈ నేపథ్యంలో రంజాన్ తర్వాత ఇరాన్ ఎప్పుడైనా ఇజ్రాయిల్పై దాడికి తెగబడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఇరాన్ నేరుగా ఇజ్రాయిల్పై దాడి చేసే అవకాశం ఉందని, దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ కూడా పూర్తిగా సంసిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయిల్పై దాడి చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన ప్రణాళికను సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముందు ఉంచామని, ఆయన సలహాదరుడు చెప్పారు.
ఇదిలా ఉంటే, సిరియాపై దాడికి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ బాధ్యత వహించలేదు. ఇజ్రాయిల్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ టాప్ కమాండర్ మహ్మద్ రెజా జహేది మరణించారు. ఇజ్రాయిల్ శిక్షించబడాలి, దాడి తప్పకుండా ఉంటుందని అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. మరోవైపు దాడి తప్పదని భావిస్తున్న ఇజ్రాయిల్ అందుకు సిద్ధమవుతోంది. పలు ప్రాంతాల్లో బంకర్లను సిద్ధం చేస్తోంది. గాజా దక్షిణ ప్రాంతాల్లోని ఇజ్రాయిల్ బలగాలను వెనక్కి రప్పించింది. తమ ప్రజల్ని రక్షించుకోవడానికి, దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు.