India-Bangladesh: ఉగ్రవాదుల బెదిరింపులు, బంగ్లాదేశ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని (IVAC) మూసివేసింది. భద్రతా పరిస్థితిని చూపిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్యకలాపాలను నిలిపేసింది. బుధవారం షెడ్యూల్ అయిన అన్ని అపాయింట్మెంట్లను తర్వాత తేదీకి తిరిగి షెడ్యూల్ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్ప్లాజాల మూసివేతకు ఆదేశం
దీనికి ముందు, భారత్లో బంగ్లాదేశ్ హైకమిషనర్ ఎం రియాజ్ హమీదుల్లాకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. బంగ్లాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై తన ఆందోళనను తెలియజేసింది. ఢాకాలోని భారత మిషన్ భద్రతను కొందరు తీవ్రవాద శక్తులు టార్గెట్ చేయడంపై ఎంఈఏ బంగ్లా రాయబారిని పిలిచింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని భారత్ తన ఆందోళన వ్యక్తం చేసింది.
అంతకుముందు, బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు, నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా భారత్ను రెచ్చగొట్టే ప్రకటన చేశారు. తమ దేశాన్ని అస్థిరపరిస్తే భారత్ దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఒంటరి చేస్తామని హెచ్చరించారు. ప్రతిఘటన అగ్ని సరిహద్దుల్ని దాటుతుందని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.