యావత్తు ప్రపంచాన్ని ఘడఘడలాడించిన కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా విలయ తాండవం చేస్తోంది. మొదటి నుంచి ఫ్రాన్స్ను వదలనంటున్న కరోనా వైరస్.. ఇప్పుడు మరింతగా పెరిగింది. ఇప్పుడు ఫ్రాన్స్వాసులు మరో వేవ్ను ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్లో ప్రతి రోజూ వేలాది కేసులు నమోదవుతుండడంతో కొత్త వేవ్ తప్పదన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. ఇదే విషయాన్ని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ కూడా వ్యాఖ్యానించారు. తామిప్పుడు కొత్త వేవ్ను ఎదుర్కొంటున్నట్టు వెల్లడించచారు. దేశంలో పెరగుతున్న కేసులు చూస్తుంటే వైరస్ విజృంభణ తప్పదేమోనని, అయితే, ఈ కొత్త వేవ్ తీవ్ర ఎంత వరకు ఉంటుందనే విషయాన్ని మాత్రం తాము చెప్పలేమని అలైన్ ఫిషర్ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణ సమయంలో మాస్కులు తప్పకుండా ధరించాలని అలైన్ ఫిషర్ సూచించారు.
నిన్న ఒక్క రోజే ఫ్రాన్స్లో 50,402 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా కొత్త కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరుకుందని అధికారులు వెల్లడించార. అంతేకాదు, ఏడు రోజుల వ్యవధిలోనే కేసులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇక, యూరోపియన్ దేశాల్లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అయిన బీఏ.4, బీఏ.5 వేగంగా వ్యాప్తి చెందడమే ఇందుకు కారణమని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ (ECDC) వెల్లడించింది. ప్రస్తుతానికి కరోనా బాధితుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కొత్త వేరియంట్లు రూపాంతరం చెందితే మాత్రం తీవ్రత ఎక్కువ ఉండొచ్చని ఈసీడీసీ పేర్కొంది.