Hijab Protest In Iran:ఇరాన్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహ్స అమిని అనే మహిళ హిజాబ్ వేసుకోనందుకు మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత గత శుక్రవారం ఆమె మరణించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, యువత హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హిజాబ్ తీసువేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తన ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా రాజధాని టెహ్రాన్ తో పాటు ఇతర నగరాల్లో కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఆందోళనల్లో పాల్గొంటున్నారు. గురువారం పలు పోలీస్ స్టేషన్లకు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. 2019 తరువాత ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ తో పెద్ద ఎత్తున ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఆందోళనలు రాజధానితో పాటు 50 నగరాలకు వ్యాపించాయి.
Read Also: Gyanvapi case: శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని కోరిన హిందూ పక్షం
మరోవైపు ప్రభుత్వం ఈ నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘‘మేము చనిపోతే చనిపోతాం కానీ.. ఇరాన్ ను తిరిగి పొందుతాం’’ అని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఆరురోజులుగా నిరసనలు పెరుగుతుండటంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ పై తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు బ్లాక్ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ తో సహ ఇటీవల కాలంలో మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసిన తర్వాత ఇరాన్ ప్రజలు వాట్సాప్, ఇన్ స్టాను ఎక్కువగా వాడుతున్నారు. అయితే నిరసనలు మరింత పెరగకుండా ప్రభుత్వం సోషల్ మీడియాను బ్లాక్ చేసింది.
గతవారం మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో రాజధాని టెహ్రాన్ లో పర్యటిస్తున్న సమయంలో హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మంగళవారం అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ.. శుక్రవారం మరణించింది. ఆమె మరణంతో ఇరాన్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు, నిరసనలు పెరిగాయి.