కోవిడ్తో ఇబ్బందులు పడుతున్న ప్రపంచాన్ని.. ఇప్పుడు హవానా సిండ్రోమ్ వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత్లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్ అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సీఐఏ డైరెక్టర్కు హవానా సిండ్రోమ్ లక్షణాలపై ప్రస్తుతం అమెరికా దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా అమెరికా దౌత్యవేత్తలు, ఇంటెలిజన్స్ అధికారులు మాత్రమే వాహనా సిండ్రోమ్ బారినపడుతున్నారు. ఈ సిండ్రోమ్ వల్ల మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది. కొందరు వినికిడి కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో దాదాపు 200 మంది అమెరికా అధికారులు, వారి కుటుంబ సభ్యులు దీని బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. వికారం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.
2016లో క్యూబా రాజధాని హవానాలో అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారిలో తొలిసారిగా ఈ సిండ్రోమ్ను గుర్తించారు. హవానాలో తొలుత గుర్తించినందున దీనికి హవానా సిండ్రోమ్ అని నామకరణం చేశారు. బాధితుల్లో ఎక్కువ మంది క్యూబా, చైనా, రష్యా, ఆస్ట్రియా, పోలాండ్లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారే ఉన్నారు. డిప్లోమాట్స్తో పాటు తమ సైనికులు కూడా పెద్ద సంఖ్యలో దీని బారినపడే ప్రమాదముందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. గత వారం హవానా సిండ్రోమ్పై తమ సైనికులను పెంటగాన్ అప్రమత్తం చేసింది. ఒక్కసారిగా మెదడు సమస్యలతో సతమతమవుతున్న సైనికులు వెంటనే తమకు సమాచారమివ్వాలని కోరింది. అయితే, హవానా సిండ్రోమ్ ఎందుకు? ఎలా? వస్తుందో శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు. ఇది సోకుతున్న వారికి మెదడు తీవ్రంగా దెబ్బతింటున్నట్లు స్కానింగ్లో తేలింది. భారీ ప్రమాదం జరిగితే మెదడు దెబ్బతినే స్థాయిలో.. హవానా సిండ్రోమ్ కారణంగా మెదడు దెబ్బతినడం పట్ల వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హవానా సిండ్రోమ్ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. దీని వెనుక శత్రు దేశాల కుట్ర ఏమైనా ఉండొచ్చన్న అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. మైక్రోవేవ్ తరంగాల సాయంతో గుర్తు తెలియని ప్రత్యర్థులు తమ సిబ్బందిపై దాడులు చేస్తున్నట్లు భావిస్తోంది. అగ్రరాజ్యం అలా సందేహించడానికి బలమైన కారణాలు లేకపోలేదు. ఈ సిండ్రోమ్ బారినపడుతున్న వారిలో ఎక్కువమంది అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనికులు, సీఐఏ సిబ్బంది, విదేశాంగ శాఖ ఉద్యోగులే ఉండడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.