Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాలో హింసకు కారణమైంది. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేతల్లో హాది కీలకంగా వ్యవహరించాడు. ఇతడిని గుర్తుతెలియని వ్యక్తులు దగ్గర నుంచి కాల్చారు. తీవ్రగాయాలైన హాది మరణించడంతో ఒక్కసారిగా రాడికల్ ఇస్లామిక్ శక్తులు వీధుల్లోకి వచ్చి హింసకు కారణమయ్యారు. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ఈ తరుణంలో మరోసారి అక్కడ హింసను చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, అక్కడ మతోన్మాద మూక హిందువుల్ని టార్గెట్ చేసింది. మరోసారి, అక్కడ ఇస్లామిక్ శక్తులు హిందువులపై దాడులకు తెగబడుతున్నారు.
ఈ హింసతో ఎవరికి లాభం:
ఈ హింసతో మరోసారి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఢాకాతో పాటు పలు నగరాలు, పట్టణాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఆ దేశంలో భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత పెరగడంతో పాటు, మతోన్మాదం పెరిగింది. ముఖ్యంగా, జమాతే ఇస్లామి, అన్సరుల్లా బంగ్లా వంటి సంస్థలు మతాన్ని ఆయుధంగా మార్చుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు తమ శక్తిని పెంచుకోవడానికి జమాతే ఇస్లామీతో పాటు ఇతర ఇస్లామిక్ పార్టీలు ఈ హింసను ఉపయోగించుకుంటున్నాయి. ఈ జమాతే ఇస్లామీనే 1971లో పాకిస్తాన్తో కలిసి, బంగ్లా ప్రజల ఊచకోత, అత్యాచారాలకు కారణమైంది. ఈ ఏడాది మహ్మద్ యూనస్తో కలిసి అమెరికా వెళ్లిన ఈ సంస్థ నాయకుడు ముహమ్మద్ తాహెర్ న్యూయార్క్లో ప్రసంగిస్తూ.. 5 మిలియన్ల మంది భారత్కు వ్యతిరేకంగా జిహాద్కు సిద్ధంగా ఉన్నారని బెదిరించాడు.
బీఎన్పీని అణిచే ప్రయత్నం, ఎన్నికల వాయిదాకు కుట్ర:
షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, బంగ్లాలో బీఎన్పీ(బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) అధికారంలోకి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, తామే అధికారంలోకి వచ్చేలా జమాతే ఇస్లామీ ఈ హింసను, భారత వ్యతిరేక కథనాలను ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన ‘‘అవామీ లీగ్’’ పార్టీని నిషేధించింది. ఒక వేళ పరిస్థితి చేయిదాటితే, ఎన్నికల్ని వాయిదా వేయాలని మహ్మద్ యూనస్ కూడా భావిస్తున్నారు. ఇదే జరిగితే యూనస్ ప్రభుత్వంపై మరింత పట్టు సంపాదించవచ్చని జమాతే ఇస్లామి భావిస్తోంది.
హాది మరణం తర్వాత ఆందోళలు:
నిజానికి హాది మరణానికి ఎవరు కారణమమో ఇంత వరకు అక్కడి అధికారులు వెల్లడించలేదు. అయితే, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం మాత్రం దీనిని భారత్కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిజానికి హాది మరణం తర్వాత అల్లర్లు కనిపిస్తున్నా, చాలా కాలంగా బంగ్లా నివురుగప్పిన నిప్పులా ఉంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ లో జరిగిన తిరుగుబాటు దర్యాప్తుపై ఎంక్వైరీ కమిషన్ నివేదిక విడులైంది. తిరుగుబాటుకు అవామీ లీగ్ ప్రభుత్వాన్ని నిందించింది. భారతీయుల ప్రమేయం ఉందని ఇది ఆరోపించింది. దీంతో ప్రస్తుత భారత వ్యతిరేక కథనాన్ని మరింత రెచ్చగొట్టింది.
ఉస్మాన్ హాది మరణం తర్వాత ఇది ఉన్మాదంగా మారింది. యూనస్, జమాతే-ఇ-ఇస్లామీలోని అతని మద్దతుదారులు హదీ హత్యను ఉపయోగించి అవామీ లీగ్ (మరియు భారతదేశం) మరియు బిఎన్పి నాయకుడు మీర్జా అబ్బాస్ రెండింటిపై ఒకేసారి దాడి చేయవచ్చు. ఇప్పుడు ఇస్లామిక్ రాడికల్స్ చేస్తున్నది ఇదే. అవామీ లీగ్తో పాటు బీఎన్పీపై దాడులు చేస్తున్నారు. బంగ్లాను ఇస్లామిస్ట్లు స్వాధీనం చేసుకునే అవకాశ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే భారత్ పక్కలో మరో పాకిస్తాన్గా బంగ్లా మారడం ఖాయం.