కరోనా కట్టడికి భారత్లో వ్యాక్సినేషన్ వీలైనంత వేగంగా కొనసాగించాలని సర్కార్ భావిస్తున్నా… టీకాల కొరత మాత్రం వెంటాడుతూనే ఉంది.. ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభంకాని పరిస్థితి. అయితే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు.. కోవిషీల్డ్, కోవాగ్జిన్తో పాటు.. రష్యా టీకా కూడా భారత్కు చేరుకోగా.. ఇప్పుడు భారత్కు వ్యాక్సిన్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్.. భారత్కు త్వరలోనే 50 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అంటే 5 కోట్ల వ్యాక్సిన్లు పంపించబోతున్నట్టు ఫైజర్ వెల్లడించింది. దీనిపై భారత ప్రభుత్వంతో ఉన్నత-స్థాయి చర్చలు జరుగుతున్నాయని.. ఈ సంవత్సరం మూడవ త్రైమాసికం నాటికి ఫార్మా దిగ్గజం తన కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులో 50 మిలియన్లను భారత్కు విక్రయించడానికి పూనుకున్నట్టుగా చెబుతున్నారు. సీనియర్ ఫైజర్ ఎగ్జిక్యూటివ్లతో వరుస సమావేశాలలో ఈ టీకాల లభ్యతపై ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. అంటే.. ఫైజర్ టీకా కూడా భారత్లో అందుబాటులోకి వస్తే.. వ్యాక్సిన్ల కష్టాలు కొంతమేర తీరనున్నాయన్నమాట.