India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా టొరంటోలోని మాల్టన్లో జరిగిన ఖలిస్తాన్ అనుకూల నగర్ కీర్తన్ పరేడ్పై భారత్, కెనడాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా తీవ్రవాద అంశాలకు చోటు కల్పిస్తోందని మండిపడింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో.. ‘‘కెనడాలోని తీవ్రవాద అంశాలు మా రాజకీయ నాయకత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక చిత్రాలను ఉపయోగిస్తున్నారు. మేము పదేపదే మా ఆందోనలను లేవనెత్తాము. గత ఏడాది ఖలిస్తాన్ మాజీ ప్రధాని హత్యకు సంబంధించిన పోస్టర్ ప్రదర్శించారు’’ అని పేర్కొన్నారు. క్రిమినల్, వేర్పాటువాద అంశాలకు కెనడాని సురక్షితమైన స్వర్గధామంగా మార్చడం ఆపాలని కెనడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామని ప్రకటన పేర్కొంది.
Read Also: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
హింసను వేడకగా జరుపుకోవడం, కీర్తించడం ఏ నాగరిక సమాజంలో కూడా భాగం కాదు. చట్టబద్ధమైన పాలనను గౌరవించే ప్రజాస్వామ్య దేశాలు భావప్రకటన స్వేచ్ఛ పేరుతో తీవ్రవాద శక్తుల ద్వారా బెదిరింపులకు అనుమతించకూడదని జైశ్వాల్ అన్నారు. కెనడాలో మా దౌత్య ప్రతినిధుల భద్రత గురించి మేము ఆందోళన చెందుతున్నామని, వారు తమ బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించగలరని కెనడా ప్రభుత్వం నిర్ధారిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. టొరంటోలో అంటారియో గురుద్వారా కమిటి ఈ ఖలిస్తాన్ అనుకూల పరేడ్ నిర్వహించింది. భారత రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నినాదలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీని జైలులో ఉంచినట్లు ఓ ఫోటోను ప్రదర్శించారు. 6 కిలోమీటర్ల పాటు సాగిన ఈ పరేడ్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులుగా గుర్తించబడిన పరమ్ జిత్ మాండ్, అవతార్ సింగ్ పన్నూ వంటి వ్యక్తులు ఖలిస్తాన్ అనుకూల ప్రసంగాలు చేశారు.