Sri Lanka Fuel Crisis: ఇంధన కొరత చాలా దేశాలను వేధిస్తోంది.. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వారానికి ఐదు రోజులుగా ఉన్న పని దినాలను నాలుగు రోజులకు కుదిస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి బుధవారం సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కొత్త విధానం మార్చి 18 నుంచి అమలులోకి రానుంది.
ఇంధన వినియోగం తగ్గించడమే లక్ష్యం
దేశంలో ప్రస్తుతం పెద్దగా ఇంధన కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల రాకపోకల్లో ఇంధన వినియోగం తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేయాల్సి ఉంటుంది. మిగిలిన నాలుగు రోజుల్లో ఎంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కావాలన్నది ఆయా శాఖాధిపతులు నిర్ణయిస్తారు.
అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయి
అయితే, ఆరోగ్య రంగం, ఓడరేవులు, నీటి సరఫరా వంటి అత్యవసర సేవలు మాత్రం అన్ని రోజులు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ నిర్ణయం పాఠశాలలు, కళాశాలలకు కూడా వర్తించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరమైతే విశ్వవిద్యాలయాల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ వేడుకలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.