Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్

  • ఇరాన్‌పై 1,000 క్షిపణులు ప్రయోగిస్తామని ట్రంప్ హెచ్చరిక.
  • అవసరమైతే ఏడాది పాటు దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య.
  • అమెరికా వైఖరి మారే వరకు చర్చలు జరపబోమని ఇరాన్ సంకేతాలు.
Iran War

Iran War

Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా ఇటీవల ఇరాన్‌పై భారీ దాడులు చేసింది. ఇదిలా ఉంటే, ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ చర్చల కోసం ముందుకు వచ్చిందని వెల్లడించారు. మరోవైపు, ఇరాన్‌ను హెచ్చరిస్తూ.. అవసరమైతే 1000 క్షిపణులతో దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవసరం వస్తే ఏడాది పాటు నిరంతరం దాడులు కొనసాగించే సత్తా అమెరికా సైన్యానికి ఉందని పేర్కొన్నారు.

తనపై హత్యాయత్నం జరిగితే ఇరాన్‌పై భారీ స్థాయిలో క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించారు. తొలి దశలో 1000 క్షిపణుల్ని ప్రయోగించి, ఆ తర్వాత మరిన్ని వేల క్షిపణులతో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో అమెరికా హెచ్చరికల నేపథ్యంలో, ఆ దేశంతో చర్చలకు అవకాశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా తన వైఖరి మార్చుకునే వరకు చర్చలు జరగవని ఇరాన్ తెలిపినట్లు సమాచారం.

హార్ముజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో మరోసారి ఈ వారం ఉద్రిక్తలు పెరిగాయి. దీంతో అమెరికా ఇరాన్ నగరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఖతార్, బహ్రైయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అమెరికా దాడుల్లో ఇరాన్ సైనిక సదుపాయాలతో పాటు రైల్వే వంతెనలు, పోర్టులు దెబ్బతిన్నాయి.