రెండేళ్ళకు పైగా ప్రపంచాన్ని వణికించింది చిన్న వైరస్. గతంలో ఎన్నడూ లేని విధంగా మృత్యుఘంటికలు మోగించిన కోవిడ్ కథ ముగిసిందా. ఈ వైరస్ అప్పుడే అంతం కాలేదని స్పష్టం చేసింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కరోనా తగ్గింది కదా అని ఏమాత్రం లైట్ తీస్కోవద్దని హెచ్చరించింది. కరోనా శాశ్వతంగా ఇకపై మనతోనే ఉండనుందా? ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కరోనా కథ ముగిసిందని.. మహమ్మారి ఎండెమిక్గా మారినట్టు తెలిపింది. అయితే వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుందని.. సీజనల్ ఫ్లూ లాగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎక్కువ మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడినట్టు అంచనా వేసింది లాన్సెట్.
కరోనా అంటు వ్యాధి కాబట్టి.. అది దాని శక్తిని కోల్పోయినా.. సీజనల్ వ్యాధుల రూపంలో మనతోనే ఉంటుందని పేర్కొంది. రుతువులు మారే క్రమంలో వచ్చే సాధారణ జలుబు, జ్వరం రూపంలో.. కొవిడ్ కొనసాగుతుందని తెలిపింది. సాధారణ అంటు వ్యాధిలా ఉంటుంది కాబట్టి.. దాని వల్ల తీవ్ర అనారోగ్యం ఉండకపోవచ్చంది లాన్సెట్. అయినా.. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే అని.. అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందే అని సూచించింది.
లాన్సెట్ చెప్పినట్టు వైరస్ బలహీన పడి సాధారణ ఫ్లూగా మారుతుందా? లేక మరికొన్ని బలమైన వేరియంట్లు పుట్టుకొచ్చి.. కొవిడ్ తీవ్రత ఇంకా పెరుగుతుందా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. గతంలో కొంత మంది వైద్య నిపుణులు… మూడో వేవ్ ఉండకపోవచ్చని చెప్పిన సందర్భాలు చూశాం. కానీ థర్డ్వేవ్ పంజా విసిరింది. మరో దశలో కూడా వైరస్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతుందేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.