Covid Situation in China: కరోనా మహమ్మారి పుట్టిన చైనా ఇప్పుడు ఆ వైరస్ తోనే అల్లాడుతోంది. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా చైనాలో కోవిడ్ 19 కేసులు నమోదు అవుతున్నాయి. ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ధాటికి చైనా ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చైనాలో 80 శాతం మంది ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు అక్కడి ప్రభుత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రెండు మూడు నెలల్లో అతిపెద్ద కోవిడ్ 19 వేవ్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని అన్నారు.
Read Also: Rohit Sharma: నవ్వులు పూయించిన రోహిత్ శర్మ..వైరల్ వీడియో
చైనాలో లూనార్ న్యూ ఇయర్ సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వస్థలాలకు వెళ్లారు. ప్రజలు మాస్ మూమెంట్ వల్ల మహమ్మారి వ్యాప్తి చెందుతుందని, ఇతర ప్రాంతాల్లో కూడా కోవిడ్ వ్యాధిని విస్తరింపచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో సమీప కాలంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని.. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జన్యు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇదిలా ఉంటే చైనీస్ న్యూ ఇయర్ వల్ల గ్రామాల్లో కూడా వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో ఈ సమయంలో కోవిడ్ రోగుల సంఖ్య గరిష్ట స్థాయిని దాటుతుందని జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు చెబుతున్నారు. చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేయడంతో ఒక్కసారిగా ఆ దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య పెరిగింది. బీజీంగ్, షాంఘైలతో పాటు ఇతర ప్రధాన నగరాలు పట్టణాల్లో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోయాయి. శ్మశానాలు కోవిడ్ రోగుల మరణాలతో నిండిపోయాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన నెలలో జనవరి 12 వరకు 60,000 మంది మరణించారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింతగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.