బంగ్లాదేశ్లో గతేడాది జరిగిన హింసాత్మక అల్లర్ల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి షేక్ హసీనాను బంగ్లాదేశ్కు రప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు పలుమార్లు భారత్కు లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకు భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఆమెకు సంబంధించిన వార్త మరోసారి హల్చల్ చేసింది. విద్యార్థులు ఉద్యమం చేస్తున్న సమయంలో వాళ్లను కాల్చి చంపేయాలని షేక్ హసీనా భద్రతా దళాలకు ఆదేశాలు ఇచ్చినట్లు బీబీసీ తన నివేదికలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Shraddha : విమానంలో శ్రద్ధా-రాహుల్ సీక్రెట్ వీడియో.. రవీనా టాండన్ ఫైర్!
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరోసారి భారత్కు విజ్ఞప్తి చేసింది. మనస్సాక్షి ప్రకారం షేక్ హసీనాను అప్పగించాలని కొత్త అభ్యర్థన చేసింది. నైతిక విలువలకు కట్టుబడి అప్పగించాలని కోరింది. ఈమేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ పేరుతో ప్రెస్ సెక్రటరీ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Iran Warns Trump: ట్రంప్ సన్బాత్కి వెళ్లినప్పుడు డ్రోన్తో దాడి చేస్తాం..
షేక్ హసీనాను అప్పగించే విషయాన్ని సుదీర్ఘకాలం పొడిగించడం సబబు కాదని.. మానవాళిపై నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత్ రక్షణ కల్పించడం భావ్యం కాదని తెలిపింది. పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వ్యక్తులను ఏ ప్రాంతీయ బంధం, ఏ రాజకీయ వారసత్వం కాపాడలేదని పేర్కొంది. చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య సమగ్రత ఉమ్మడి విలువను భారత్ గౌరవించాలని.. ఎంతటి శక్తిమంతమైన నాయకులైనా చట్టానికి అతీతం కాదని, బాధితులకు న్యాయం జరగాల్సిందేనని ప్రకటనలో స్పష్టంచేశారు.
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పోరాడిన కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడంపై గతేడాది పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. చివరకు ఈ అల్లర్లు షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి కారణమైంది. ఈ అల్లర్ల అణచివేతలో 1400 మంది వరకు మరణించినట్లు చెబుతున్నారు. 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్లో దారుణమైన హింస ఇదే.
మానవత్వానికి విరుద్ధంగా జరిగిన నేరాలకు సంబంధించి షేక్ హసీనాపై బంగ్లాదేశ్ లో కేసులు ఫైల్ చేశారు. అయితే ఇప్పుడు హసీనా ఆడియో లీక్ని ఉపయోగించుకోవాలని బంగ్లా ప్రాసిక్యూటర్లు ఆలోచిస్తున్నారు. ఆగస్టు 5న ఢాకాలోని జత్రాబారి పరిసరాల్లో అత్యంత దారుణమైన మారణహోమం జరిగింది. అక్కడ సైన్యం ఆ ప్రాంతం నుంచి వైదొలిగిన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కొత్తగా బయటపడిన ఆధారాల ప్రకారం, కనీసం 52 మంది మరణించారు. ఇది మునుపటి నివేదిక కన్నా ఎక్కువ. హసీనాతో పాటు, మాజీ పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులతో సహా 203 మందిపై అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) నేరారోపణలు చేసింది, 73 మంది కస్టడీలో ఉన్నారు.