భారతీయ విద్యార్ధులకు చైనా శుభవార్త అందించింది. గతంలో చైనాలో చదువులను మధ్యలోనే వదిలి వచ్చేసిన భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు చైనా గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపుగా రెండున్నర సంవత్సరాల తర్వాత వీసా ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. చైనా తిరిగి స్వాగతం పలుకుతోందంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల విభాగం కౌన్సెలర్ జీ రోంగ్ ట్వీట్ చేశారు. విద్యార్థులు, వ్యాపారులు, చైనాలో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైందని ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం కూడా ప్రకటించింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్తగా వచ్చే వారికి, కరోనా సమయంలో నిలిచిపోయిన చదువును పూర్తి చేయాలనుకుంటున్న వారికి ఎక్స్-1 వీసాలను జారీ చేస్తామని పేర్కొంది.
Read Also: Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్దం.. ముహూర్తం ఈనెల 28..!
కరోనా సమయంలో చైనాలో వుండడం అంత సేఫ్ కాదని అక్కడున్న 23 వేల మంది విద్యార్థులు భారత్కు వచ్చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువమంది వైద్య విద్యార్థులే ఉన్నారు. ఇలాంటి వారిలో తిరిగి చైనా వచ్చి ఆగిపోయిన చదువును కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్న వారి జాబితాను చైనా ఇటీవల సేకరించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో వీరందరినీ తమ దేశానికి తిరిగి ఆహ్వానిస్తోంది. చైనా వెళ్లాలనుకునే వారు అక్కడి యూనివర్సిటీలు తమకు జారీ చేసిన ప్రవేశ పత్రాన్ని వీసా కోసం సమర్పించాలి. పాత విద్యార్థులైతే చైనా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వీసాలు ఇస్తామని చైనా ప్రకటించినా.. భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే. మరోవైపు, శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు ఇటీవల ప్రత్యేక విమానాల్లో చైనాకు చేరుకుంటున్నారు. అక్కడ యూనివర్శిటీలు కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
జూలైలో, చైనాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల కుటుంబ సభ్యులను చైనా అనుమతించింది. వారిలో చాలా మంది సాధారణ టిక్కెట్ ధరల కంటే చాలా రెట్లు అధికంగా చెల్లించి ప్రక్క దేశాల్లోని వివిధ మార్గాల ద్వారా వచ్చారు. విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని భారత్, చైనా అధికారులు తెలిపారు. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించిన వీసాల వర్గంలో సిబ్బందికి జారీ చేసిన సి-వీసా కూడా ఉంది.
Read Also: Heavy Demand For Pulasa Fish: యానాంలో ఆ పులస చేపకు యమా డిమాండ్