ప్రస్తుతం చాలామంది ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని కూడా ఇంట్లో మనుషులానే ప్రేమగా సాకుతుంటారు. అవి ఎంత అల్లరి చేసినా వారికి ముద్దుగానే ఉంటాయి. ఇక యజమానులపై పెట్స్ కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి. యజమానికి ఏదైనా ఆపద వస్తే వారిని కాపాడడానికి ప్రాణాలు ఇవ్వడానికి అయినా, ప్రాణాలు తీయడానికి అయినా అవి వెనుకాడవు. ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటివరకు చాలానే చూసాం. కానీ.. ఎంత కాదు అనుకున్నా అవి జంతువులు అనేది కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వార్త కూడా అలాంటిదే.
వివరాల్లోకి వెళితే.. రష్యాలోని రోస్టోవ్ లో ఒక మహిళ(55) ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు పిల్లులు అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆమె పిల్లులను పెంచుతోంది. ప్రస్తుతం ఆమె వద్ద 20 పిల్లులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా వాటి కోసం రాత్రి కల్లా ఇంటికి వచ్చేసేది. మూడు పూటలా వాటికి నచ్చిన ఆహారం వండి పెట్టేది. అయితే అనుకోని విధంగా ఒక వారం క్రితం ఒక్కసారిగా ఆమె కుప్పకూలి పడిపోయింది. చూసేవాళ్లు లేరు.. అడిగేవాళ్లు అస్సలు లేరు. దీంతో ఆమె మృతి చెందింది అన్న విషయం కూడా బయట ఎవరికి తెలియదు. ఇలా వారం గడిచింది. ఇంట్లో ఉన్న 20 పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి.
ఇక ఆహరం లేక ఆ పిల్లులు ఇప్పటివరకు తమను సాకిన యజమాని అని కూడా లేకుండా ఆమెను పీక్కుతినడం మొదలుపెట్టాయి. అలా మహిళ శరీరాన్ని కొంచెం కొంచెం లాగుతూ చర్మాన్ని తింటూ కడుపు నింపుకున్నాయి. ఇక చివరికి వారం తరువాత ఇంటి పక్కన ఉన్నవారికి మహిళ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా.. పిల్లులు మహిళ శవంపై పడి పీక్కుతింటున్న దృశ్యం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లులు తినగా మిగిలిన బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు.