Mumbai: ఇటీవల కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా మాట్రిమోనియల్ సైటుల ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకోవడమే ఎక్కువ అవుతోంది. తమ పిల్లలకు తమ స్థాయి, హోదా కలిగిన వధువు/వరుడిని వెతికేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా మాట్రిమోనల్ సైట్లపై ఆధారపడుతున్నారు. తమకు తెలిసిన బంధువులు, చుట్టాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా గొప్పలకు పోతూ మాట్రిమోనీల ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.
అయితే ఇదే సమయంలో కొందరు మోసగాళ్లకు ఇది వరంగా మారుతోంది. పెళ్లి చేసుకుంటామని నమ్మించడమో లేకపోతే తప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసి తాము పెద్ద ఉద్యోగం చేస్తున్నామని, ఆస్తులు ఉన్నాయని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. తీరా చివరకు అమ్మాయిలు, అమ్మాయి తల్లిదండ్రులు మోసపోవడం పరిపాటిగ మారింది. పెళ్లికి ముందు ఏడు తరాల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు, కానీ సరిగ్గా అబ్బాయి గురించి తెలుసుకోలేక మోసపోతున్నారు.
తాజాగా ముంబైలో జరిగిన సంఘటన ఇదే కోవకు చెందుతుంది. నవీ ముంబైకి చెందిన 33 ఏళ్ల మహిళకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. సింగపూర్లో ఉన్న నిందితుడిపై సదరు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376(2)ఎన్ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
నవీ ముంబై, ముంబై, సింగపూర్లోని లాడ్జీలు, హోటళ్లలో డిసెంబర్ 2020 నుంచి మార్చి 2023 మధ్య పలు సందర్భాల్లో నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు మహిళకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను తీశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.