దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని తల్లి డింపుల్ దారుణంగా ప్రవర్తించింది. ఈ బిడ్డను హత్య చేసేందుకు వంట గదిలోని మైక్రోఓవెన్లో పెట్టింది. ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో డింపుల్ వంట గది డోర్ లాక్ చేసింది.
అంతలోనే ముసలావిడ అరుపులు విని ఇరుగుపొరుగు వారు వెంటనే వచ్చి వంట గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలకు వెళ్లి మైక్రోఓవెన్ తీసి చూడగా పాప చనిపోయి కనిపించింది. దీంతో ఈ ఘటనపై వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా రెండు నెలల పసిపాపను కన్నతల్లే హత్య చేయడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలకు ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి ఘటనలు ఎదురవుతాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు.