Mahabubabad: ఆస్తి కోసం బంధాలు, బంధుత్వాలను కూడా వదులుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఐతే కొంత మంది మరో అడుగు ముందుకు వేసి.. ఆస్తుల కోసం సొంత వారిని సైతం కడతేర్చేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా మంగలి తండాలో జరిగింది. ఆస్తి కోసం ఏకంగా అత్త, మామకు కరెంట్ షాకిచ్చాడు ఓ కిల్లర్ అల్లుడు. ఇంతకీ ఎవరా కంత్రీగాడు? అత్త, మామ పరిస్థితి ఎలా ఉంది?
Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మంగలి తాండలో ఆస్తి ఓ యువకుడిని ఉన్మాదిగా మార్చింది. తన సొంత అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలపై విద్యుత్ షాక్తో దాడికి దిగాడు ఆ కంత్రీ అల్లుడు. అంతే కాదు.. అడ్డం వచ్చిన తన వదినపైనా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వాయిస్: గార్ల మండలం మంగలి తాండకు చెందిన రాజేష్ అనే వ్యక్తి కొంతకాలంగా కుటుంబ ఆస్తి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఐతే రాజేష్కు సొంత అన్నయ్య రమేష్కు ఇప్పటికే పెళ్లయింది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా రమేష్కు ఈ మధ్యే రెండో పెళ్లి జరిగింది. ఇది తమ్ముడు రాజేష్కు అస్సలు నచ్చలేదు. అన్నకు రెండో పెళ్లి చేస్తే తన ఆస్తిలో వాటా తగ్గిపోతుందని.. ఆ యువకుడు ఆలోచిస్తూ వచ్చాడు. ఈ రెండో పెళ్లి జరగడానికి ప్రధాన కారణం.. అత్తమామలేనని భావించిన అతను.. వారిపై ఊహించని స్థాయిలో పగ పెంచుకున్నాడు.
అర్ధరాత్రి ఆ యువకుడు భారీగా మద్యం సేవించి అదే మత్తులో ఇంటికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న అత్త కౌసల్యని, మామ అజ్మీరా రాందాసులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎవరు ఊహించని విధంగా సినిమాలో క్రైమ్ తరహాలో అత్తమామలు ఇద్దరికీ కరెంటు వైర్ల ద్వారా షాక్ ఇచ్చాడు. ఈ ప్రమాదంలో కౌసల్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మామ రాందాసు అదృష్టవశాత్తు అతడి దాడి నుంచి తప్పించుకున్నారు. బయటకు పరుగులు తీయడంతో అతని ప్రాణాలు దక్కాయి.
మరోవైపు అదే మద్యం మత్తులో ఉన్న రాజేష్.. అంతటితో ఆగకుండా తన వదినను కూడా చంపేయడానికి ప్రయత్నించాడు. అడ్డం వచ్చిన ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కత్తి వేటు పడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే అరుపులు కేకలతో ఇరుగు పొరుగు వారు ఘటనా స్థలానికి వచ్చారు. స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన స్థలానికి వచ్చి క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించారు. నిందితుడు రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తి తగాదాలతో పాటు కుటుంబ కలహాలు.. ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.