Drunk and Drive: మందుబాబులు రెచ్చి పోతున్నారు.. మద్యం మత్తులో తాగి ఊగడమే కాకుండా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. సామాన్యులు హైదరాబాద్ రోడ్ల మీద నడిచి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. హైదరాబాద్లో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన పోకిరీలు.. ఒకే రోజు ముగ్గురు ప్రాణాలు తీశారు. ఈ హిట్ అండ్ రన్ కేసులతో హైదరాబాద్లో మూడు కుటుంబాల్లో విషాదం నింపాయి. హైదరాబాద్లో ఇలాంటి రోడ్ టెర్రర్ ఘటనలు ఒక దాని వెనుక ఒకటి జనంలో భయం పుట్టిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. పోకిరీల వాహనాల బీభత్సానికి తెరపడడం లేదు. తాజాగా ఒకే రోజు మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బలయ్యారు.
మందుబాబులు మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్నది కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. ఒకే రోజు గ్రేటర్ హైదరాబాద్లో మూడు వరుస ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రాంతంలో మహీంద్రా xuv కారు అత్యంత వేగంతో రాంగ్ రూట్లో ప్రయాణిస్తూ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న ఓ భారత ఆర్మీ జవాన్ను బలంగా ఢీకొట్టింది. అనంతరం మరో బైక్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆర్మీజవాన్… అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనలో గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన కారు శంషాబాద్ వ్యక్తి బాబు గౌడ్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో యువకులు కారును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నారు. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీవో ఆఫీస్ సమీపంలో తెల్లవారు జామున ఓ ద్విచక్ర వాహనాన్ని అత్యంత వేగంతో థార్ కారు ఢీ కొట్టింది. బైక్ వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న శివకుమార్కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో బాలాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్టిగా కారు భీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. అతివేగంతో ముందు ఉన్న వాహనాలను ఢీ కొట్టడమే కాకుండా.. వేగంగా వెళ్తూ పల్టీలు కొట్టింది. కారులో బీరు సీసాలను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో డ్రైవర్ కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలా వరస రోడ్డు ప్రమాదాలతో నగరవాసులు ఆందోళన గురయ్యారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్తో రోజుకు సగటున 11 నుంచి 15 మంది చనిపోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. తరచూ జరుగుతున్న ఘటనలతో.. శిక్షల్లో ఎన్నో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్లోదొరికితే డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలలు రద్దు చేయడం. రెండో సారి దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయాలని జనం కోరుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎదుటి వ్యక్తి మరణిస్తే నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు హత్య తో సమానమైన సెక్షన్లు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

