ఓ భర్త తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు.. దీంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఇలానే చేసినట్లు అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళలోని పెరుంకలలోని అనకొంబన్లో ఒక పాస్టర్ తన భార్యకు సోమవారం ఇంట్లోనే ప్రసవం చేయడంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం సంభవించింది. వైద్య సహాయం తీసుకోకుండా ఇంట్లోనే ప్రసవం చేయడం వలన ఈ విషాదం సంభవించింది. చలతర పుతెన్వీడు జాన్సన్ తన భార్య విజి కి ఇంట్లో చేసిన ఈ డెలవరీ కారణంగా నవజాత శిశువు మరణించింది.
శిశువు మృతదేహాన్ని ఇడుక్కి మెడికల్ కాలేజీ ఆసుపత్రి (MCH)కు తరలించారు. ఈ సంఘటన తర్వాత, తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను MCH కు తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించినట్లు ఇడుక్కి పోలీసులు తెలిపారు.
పెరుంకాల వార్డ్ సభ్యుడు అజేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజి గర్భధారణ సమయంలో ఆ జంట వైద్య పరీక్షలు చేయించుకోలేదని తెలిపాడు. వృత్తిరీత్యా పాస్టర్ అయిన జాన్సన్ కు పొరుగువారితో పెద్దగా పరిచయం లేదని ఆయన వెల్లడించారు. ఈ దంపతులకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆ ప్రసవాలను కూడా జాన్సన్ నిర్వహించాడని పలు ఆరోపణలు వస్తున్నాయి.