అప్పులు ప్రాణాలు తీస్తాయని పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు.. అది నిజమే అని చాలా సార్లు రుజువైంది..అప్పుల వల్ల కుటుంబాలు విచ్చిన్నం అవ్వడమే కాదు ప్రాణాలు కూడా పోతున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది..అప్పు విషయంలో చెలరేగిన ఓ గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను తీసుకుంది. తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మీద చేసిన దాడిలో అతని ఇద్దరు సోదరీమణులు మృతి చెందడం విషాదాన్ని నింపింది.. ఈ విషాద ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. నైరుతి ఢిల్లీలో ని ఆర్కేపురం అంబేద్కర్ బస్తీలో లలిత్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఒక వ్యక్తికి అతను గతంలో రూ.10వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకుని చాలా రోజులైనా చెల్లించక పోవడంతో.. తన దగ్గర తీసుకున్న మొత్తాన్ని తనకు తిరిగి చేయాలంటూ శనివారం లలిత్ అతడిని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ వ్యక్తి లలిత్ ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ పడుకున్న సమయంలో.. తనతోపాటు ఓ 20 మందిని తీసుకొని లలిత్ ఇంటికి వచ్చాడు..
తలుపులు బద్దలు కొట్టడంతో వారంతా బయపడి బందువులకు సమాచారం అందించారు.. వారందరూ రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. వారి మీద కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే లలిత్ ని కాపాడ్డానికి వచ్చిన అతని అక్కాచెల్లెలు పింకీ, జ్యోతి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.. వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ వారిద్దరూ చనిపోయారు. నిందితులు జరిపిన కాల్పుల్లో ఓ తూటా లలిత్ ను కూడా గాయపరిచింది. కాల్పులు జరిపిన తర్వాత నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..