ప్రపంచాన్ని శాసించే పదునైన ఆయుధం.. డబ్బు. అందరు ఈ డబ్బు కోసమే పరితపిస్తుంటారు. ఇంకొంతమంది డబ్బు కోసం కక్కుర్తి పడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. కేవలం ఒక వంద రూపాయల కోసం కక్కుర్తిపడి ఒక వార్డు బాయ్ చేసిన నిర్వాకం ఒక చిన్నారి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా ఊపిరితిత్తులలో సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం బాలుడిని నిలోఫర్ హాస్పిటల్ లో తల్లిదండ్రులు చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేయాలనీ చెప్పారు. రోజుకు లక్ష చొప్పున రెండు రోజులకు రెండు లక్షలు బిల్లు అయ్యింది. అయినా బిడ్డ బతకాలని డబ్బు కోసం తండ్రి మహ్మద్ ఆజం తిరుగుతున్నాడు.
ఇక ఈనేపథ్యంలోనే బాలుడికి ఆక్సిజన్ పెట్టాలని వైద్యులు సూచించగా.. వార్డ్ బాయ్ సుభాష్ .. పక్క గదిలో వేరొక రోగి బంధువులు రూ. 100 ఇవ్వడంతో బాలుడికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ ని వేరొక రోగికి అమర్చాడు. దీంతో ఖాజా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న వైద్యులు వచ్చి పరీక్షించేలోపే బాలుడు మృతిచెందాడు. తమ బిడ్డ చావుకు కారణం వార్డ్ బాయ్, ఈ హాస్పిటలే నని తెలుపుతూ బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక బాలుడు ఘటనపై ఆస్పత్రి సూపర్డెంట్ సీరియస్ అయ్యారు. బాలుడు మృతికి కారణమైన వార్డ్ బాయ్ ని సస్పెండ్ చేశారు