ఇండియాలోని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ అదిరే న్యూస్ చెప్పింది. మీ పెట్టుబడులకు అదనపు రక్షణ కల్పించేలా ‘వాలంటరీ లాక్-ఇన్’ లేదా ‘డెబిట్ ఫ్రీజ్’ అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా మనం ఇంట్లో ఉన్న నగలను భద్రత కోసం లాకర్లో పెట్టి తాళం వేసినట్లుగానే.. ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లకు కూడా డిజిటల్గా తాళం వేసుకోవచ్చు. దీనివల్ల మీ అనుమతి లేకుండా ఎవరూ మీ ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేయడం కానీ.. వేరే ఫండ్లోకి మార్చడం (Switch) కానీ సాధ్యం కాదు.
ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే.. ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ఫోన్లలోని యాప్స్ ద్వారానే మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు చాలా సులభంగా జరిగిపోతున్నాయి. ఈ సౌలభ్యం ఎంత బాగుందో, సైబర్ మోసాల భయం కూడా అంతే పెరుగుతోంది. ఎవరైనా మీ అకౌంట్ను హ్యాక్ చేసినా లేదా అనధికారికంగా లావాదేవీలు జరపాలని చూసినా.. ఈ ’లాకింగ్’ ఫీచర్ వారి ప్రయత్నాలను తిప్పికొడుతుంది. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కాపాడటానికి సెబీ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.
Also Read:Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
ఇది ఎలా పని చేస్తుందంటే.. మీరు ఒకసారి మీ ఖాతాను ‘ఫ్రీజ్’ చేస్తే.. మళ్లీ దాన్ని అన్లాక్ చేసే వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగవు. మీ దగ్గర డీమ్యాట్ ఖాతా ఉన్నా లేకపోయినా.. అంటే నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీల దగ్గర పెట్టుబడి పెట్టినా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. మొదటగా ఈ సదుపాయం ‘MF Central’ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడిదారులు తమకు అవసరమైనప్పుడు ఈ లాక్ ఫీచర్ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.
Also Read:Interest Rates Cut: ఆ బ్యాంక్లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..
ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీ ఫోలియోకు ఖచ్చితంగా కేవైసీ పూర్తయి ఉండాలి. వాడుకలో ఉన్న ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. ఇవి రెండు మీ ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఎందుకంటే లాక్ వేసేటప్పుడు లేదా తీసేటప్పుడు అథెంటికేషన్ కోసం మీకు వచ్చే మెసేజ్లు, ఓటీపీల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి వస్తాయని సెబీ పేర్కొంది.
ప్రస్తుతం మన దేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు 80 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. లక్షలాది మంది సామాన్యులు SIPల రూపంలో డబ్బులు దాచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటానికి ఈ ‘డిజిటల్ లాక్’ ఇన్వెస్టర్లకు ఒక వజ్రాయుధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.