హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ఖాతాదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల బ్యాంక్ నుంచి రుణాలు పొందిన లక్షలాది మంది కస్టమర్ల నెలవారీ ఈఎంఐల భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి. MCLR అనేది ఒక బ్యాంక్ తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటును ఇది సూచిస్తుంది. 2016 ఏప్రిల్ 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది.
Also Read:Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
గతంలో ఉన్న ‘బేస్ రేట్’ విధానం కంటే ఇది భిన్నమైనది. బ్యాంకులు తమ వద్ద ఉన్న నిధుల సమీకరణ వ్యయం అంటే.. డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ, నిర్వహణ ఖర్చుల ఆధారంగా ప్రతి నెలా ఈ రేట్లను సమీక్షిస్తాయి. MCLR తగ్గితే బ్యాంకులు ఇచ్చే హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించడంతో, కొత్త రేట్లు ఇప్పుడు 8.15 శాతం నుంచి 8.55 శాతం మధ్య అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇవి 8.25 శాతం నుంచి 8.60 శాతం వరకు ఉండేవి.
వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల లోన్ తీసుకున్న వారు ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ (EMI) తగ్గుతుంది. ఈ సవరించిన రేట్లు తక్షణమే అమలులోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. వీటితో పాటు కొత్తగా రుణాలు తీసుకునే వారికి కూడా తక్కువ వడ్డీతో లోన్లు లభిస్తాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇతర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న తరుణంలో.. హెచ్డీఎఫ్సీ రేట్లను తగ్గించడం గమనార్హం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాల్లో డిమాండ్ పెరగడానికి ఇటువంటి నిర్ణయాలు ఎంతో దోహదపడతాయి.