Union Budget 2026: నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకటించారు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు ఉండబోతున్నట్లు తెలిపారు. పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు, పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లుగా అంచనా వేశారు.
READ MORE: Pooja Hegde Stylish Look: స్టైలిష్ అవుట్ఫిట్లో పూజా హెగ్డే.. మతి పోగొడుతున్న బుట్టబొమ్మ!
ప్రస్తుతం దేశంపై ఉన్న అప్పుల పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి వివరించారు. జీడీపీలో అప్పుల వాటా క్రమంగా తగ్గుతుందని చెప్పారు. 2025-26 సంవత్సరంలో జీడీపీలో అప్పుల వాటా 56.1 శాతంగా ఉంటే, 2026-27లో అది 55.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు. అప్పుల భారం తగ్గితే ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ కూడా క్రమంగా తగ్గుతుంది. అలా మిగిలే డబ్బును వ్యవసాయం, మౌలిక వసతులు, పేదల సంక్షేమం వంటి కీలక రంగాలపై ఖర్చు చేయవచ్చని తెలిపారు. బడ్జెట్లో మరో ముఖ్యమైన అంశం ద్రవ్య లోటు. ఇది ప్రభుత్వం సంపాదనకు, ఖర్చులకు మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ లోటును క్రమంగా తగ్గిస్తున్నామని మంత్రి చెప్పారు. 2025-26లో జీడీపీలో ద్రవ్య లోటు 4.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తే, 2026-27లో దాన్ని 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడటం తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది అన్న మాట. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల గురించి ఆమె వివరించారు. 2025-26లో ప్రభుత్వం అప్పులు తీసుకోకుండా పొందే ఆదాయం సుమారు 34 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని చెప్పారు. ఇందులో కేంద్రానికి వచ్చే నికర పన్ను ఆదాయం 26.7 లక్షల కోట్ల రూపాయలు. అదే సమయంలో మొత్తం ప్రభుత్వ ఖర్చు సుమారు 49.6 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఇందులో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం పెట్టే మూలధన వ్యయం సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు అని మంత్రి తెలిపారు. రూ. 53.5 లక్షల కోట్ల అంచనాలు ఇవే..
కేంద్ర బడ్జెట్ 2026-27:
రెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లు
పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు
పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లు
మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు
రుణాల రికవరీ రూ.38,397 కోట్లు
ఇతర వసూళ్లు రూ.80,000 కోట్లు
మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లు
మూలధన ఖాతా రూ.12,21,821 కోట్లు
వాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లు
రెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లు
నికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లు
ద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లు
ప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లు
అప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లు
మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లు
మొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లు
రెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లు
వడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లు