వరుస సెలవుల కారణంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మూడు రోజుల పాటు విరామం కలగనుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం (మార్చి ఆఖరు) కావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుంటాయి. అయితే, పండుగలు , వారాంతపు సెలవులు ఒకేసారి రావడంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వచ్చే శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బ్యాంకులకు ప్రభుత్వ సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇక ఆదివారం ఎలాగూ వారాంతపు సెలవు. ఈ విధంగా శుక్ర, శని, ఆదివారాల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం మాత్రమే పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
Also Read:Sad: పాల కోసం ఏడ్చిన చిన్నారి.. గొంతు నులిమి చంపేసిన కసాయి తల్లి..
బ్యాంకుల భౌతిక కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రధానంగా చెక్ క్లియరెన్స్లు, డిమాండ్ డ్రాఫ్ట్ల జారీ, కేవైసీ (KYC) అప్డేషన్, డాక్యుమెంట్ సబ్మిషన్, లోన్ ప్రక్రియల వంటి వ్యక్తిగత సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. అత్యవసరంగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన పని ఉన్నవారు సోమవారం వరకు వేచి చూడక తప్పదు.
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ATM కేంద్రాల్లో నగదు లభ్యతపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ.. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్ లావాదేవీల కోసం Net Banking, Mobile Banking, UPI (PhonePe, GPay) వంటి సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే IMPS, NEFT వంటి ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలు డిజిటల్ పద్ధతిలో నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.