Oil Crisis: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో భారతీయ చమురు కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు ధరల పెరుగుదల దేశీయ చమురు సంస్థలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీయడమే కాకుండా, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేలా చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOC), BPCL, HPCL వంటి కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రోజుకు సుమారు రూ.2,000 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
READ ALSO: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?
ఖరీదైన దిగుమతులు.. పెరిగిన రవాణా ఖర్చులు
పెట్రోల్పై లీటరుకు రూ.20 నష్టం, డీజిల్పై లీటరుకు ఏకంగా రూ.45 నష్టం. ఈ మొత్తం నష్టంలో సింహభాగం (సుమారు రూ.1,650 కోట్లు) డీజిల్ అమ్మకాల ద్వారానే వస్తుండటం గమనార్హం. భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. గత 15 రోజుల్లోనే ముడి చమురు ధరలు 30% కంటే ఎక్కువ పెరిగాయి. దీనికి తోడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల చమురు ట్యాంకర్ల బీమా ప్రీమియంలు, సరుకు రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. గతంలో తక్కువ ధరకు లభించిన రష్యా ముడి చమురు, ఇప్పుడు బ్రెంట్ ధరల కంటే బ్యారెల్కు $2 నుంచి $8 వరకు అదనపు ప్రీమియంతో లభిస్తోంది. ఖతార్ నుంచి సరఫరా అంతరాయాల వల్ల స్పాట్ LNG ధరలు కేవలం నెల రోజుల్లోనే 50% పెరిగాయి.
ప్రస్తుతానికి చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇదే రీతిన కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం మినహా మరో మార్గం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.