కరోనా తరువాత మ్యాచువల్ ఫండ్స్ పెట్టుబడులు భారీగా పెరిగినట్లు నివేదక చెబుతున్నాయి. అయితే.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో హైదరాబాదీలే ఎక్కువ ఉన్నట్లు తాజా సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇటీవల పెట్టుబడుల వేదిక ‘గ్రో’ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్లోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు వెల్లడైంది. మిగతా మదుపరుల్లోనూ అధికులు స్టాక్స్, ఐపీవోలపైనే ఆసక్తి చూపిస్తున్నారట. 38 శాతం మంది స్టాక్స్పై పెట్టుబడులు పెడుతుండగా, కేవలం 2.32 శాతం మంది ఐపీవోల్లో పెట్టుబడుటు పెడుతున్నారు. కాగా, మ్యూచువల్ ఫండ్స్కు యువత నుంచి ఎక్కువగా ఆదరణ లభిస్తుండటం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా సంస్థకున్న 13.86 లక్షల మదుపరుల్లో 56 శాతం మంది హైదరాబాద్వారే ఉన్నారని గ్రో తెలిపింది. ఇక ‘గ్రో’ ద్వారా పెట్టుబడులు పెడుతున్న మదుపరుల్లో 22.85 శాతం మంది 25-30 ఏండ్ల వయసు గలవారేనని సర్వేల్లో తేలింది. 18-24 ఏండ్ల మదుపరులు హైదరాబాద్లోనే 19.24 శాతం మంది ఉన్నట్టు తెలిపిన ‘గ్రో’.. 31-40 ఏండ్లవారు 17.13 శాతం మంది ఉన్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలోని మదుపరుల్లో 47 శాతం మంది స్టాక్స్పై, 45 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్పై పెట్టుబడులు పెడుతున్నారు. గత కొన్నేండ్లుగా హైదరాబాద్ నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారని, నగర ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న చాలామంది పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారని, తద్వారా సంపదను సృష్టించుకుంటున్నారని తెలిపారు సంస్థ సీఈవో హర్ష్ జైన్.