UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు.
ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించేందుకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర సంస్థలకు ఆర్బీఐ ద్వారా సబ్సిడీలు అందిస్తోంది. అయితే, ఈ సేవలను దీర్ఘకాలంగా ఉచితంగా కొనసాగించడం ఆర్థికంగా సాధ్యపడదని, దీనికి సంబంధించి ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్..!
దీన్ని బట్టి చూస్తే.. భవిష్యత్లో UPI ద్వారా లావాదేవీలు చేయాలంటే వినియోగదారులు ఒక నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం తప్పనిసరి కాబోతుంది. ప్రస్తుతం కేంద్రం జీరో MDR (Merchant Discount Rate) విధానాన్ని కొనసాగిస్తోంది. అయితే ముందుముందు దీన్ని కొనసాగించాలా..? వద్దా..? అన్నదానిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అంటూ మల్హోత్రా తెలిపారు. ఈ వ్యాఖ్యలతో వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులపై MDR ఛార్జీలు తిరిగి అమలైతే భారం పడే అవకాశం ఉంది. దీంతో చాలా మంది నగదు లావాదేవీలవైపు మారుతారని నిపుణులు భావిస్తున్నారు.
భారత్ లో UPI వ్యవస్థను ఉచితంగా కొనసాగించడం ప్రపంచవ్యాప్తంగా ఓ ఆదర్శంగా నిలిచినప్పటికీ, రాబోయే కాలంలో మాత్రం ఇది సాధ్యపడదని ఆర్బీఐ స్పష్టంగా తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ఆర్థికంగా స్థిరంగా ఉంచాలంటే, సేవలకు గల వ్యయాన్ని ఎవరైనా భరించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు డిజిటల్ పేమెంట్ రంగం విజన్ మార్పుకు సంకేతంగా మారనున్నాయి. భవిష్యత్లో RBI, కేంద్ర ప్రభుత్వం UPI సేవలపై ఛార్జీలు విధించే విధానాన్ని అమలు చేస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది.