దోచుకో.. దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మేం రెండు ఎకరాల్లో ఆదాయాన్నే తిన్నాము.. ప్రజల సొమ్ము దోచుకో లేదని నారా భువనేశ్వరి దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. యాదవులను టీడీపీ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంది.. నారా చంద్రబాబు, నారా లోకేశ్, దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని ఆయన వ్యాఖ్యనించారు.
జైల్లో ఉన్న చంద్రబాబుకు 50 రోజుల శుభాకాంక్షలు హర్ష ధ్వానాలతో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దొరికిన దొంగ అంటూ విమర్శించారు.
వైసీపీ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.. అధికార దుర్వినియోగం, అందుకు తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీదా, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు.
ముసాయిదా ఓటర్లు జాబితా విడుదల నేపథ్యంలో ఓటర్ల జాబితాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఓటర్ల జాబితా అంశాలపై ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక ఇంఛార్జ్ నియామకం చేసేందుకు యోచిస్తుంది.
శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఇన్ చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వర్సెస్ శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ల మధ్య సవాళ్లు కొనసాగుతుంది. అయితే, కమ్మకోత్తుర్ లో రూరల్ సీఐ టీడీపీ నాయకులను బూతులు తిట్టి కొట్టడంతో తీవ్ర వివాదం అవుతుంది.
చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసింది అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి లోకేష్ కి లేవు అని మండిపడ్డారు.
ఉమ్మడి జిల్లాల వారీగా రేపట్నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సమన్వయ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
విశాఖపట్నంలోని భీమిలిలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అధికారం కొంత మంది చేతుల్లోనే ఉందన్న ప్రతిపక్షాల విమర్శలు అర్థ రహితం అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వేసుకున్న ముసుగులు తీసి వేసి చేస్తున్నది అనైతిక రాజకీయం కాదా? అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది. 45 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. మరో 19 మంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం ఇంకా వెల్లడించలేదు. వాటిలో నాలుగు స్థానాలను సీపీఐ, సీపీఎంలకు కేటాయించనుంది.