వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరోసారి ఫిర్యాదు చేసింది వైసీపీ… ఇవాళ ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు.. ఈ సందర్భంగా రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీలు.. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామ పాల్పడుతున్నారని స్పీకర్కు ఫిర్యాదు చేశామని.. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్కు అందించామని.. రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోసారి కోరామని తెలిపారు.. ఇక, రఘురామపై కేసులు, అరెస్ట్లు, బెయిల్ తర్వాత వరుసగా సీఎంలు, గవర్నర్లు, కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తూవచ్చిన రఘురామ.. తాజాగా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసిన సంగతి తెలిసిందే.