Kadapa Mayor: కడప మున్సిపల్ కార్పొరేషన్లో మొదలైన కుర్చీ గోల.. ఇప్పుడు ఆ మేయర్ మెడకు ఉచ్చు బిగించిందా? ఎమ్మెల్యే మేయర్ ను టార్గెట్ చేస్తూ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలంటూ విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడం… ఇప్పుడు ఆ మేయర్ స్థానానికే ముప్పు తెచ్చి పెట్టిందా ? ఇప్పుడు కడప మేయర్పై వేటుతో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి.. అయితే, కడప వైఎస్ కుటుంబానికి గత 25 సంవత్సరాలుగా కంచుకోట.. నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కడప కార్పొరేషన్ లో వారి కుటుంబం చెప్పిందే వేదం.. వారి అనుయాయులే అక్కడ కార్పొరేటర్లు.. 2006లో కడప మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి మూడు పర్యాయాలు జరిగిన కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబం చెప్పిన వ్యక్తిలే మేయర్గా కొనసాగుతూ వస్తున్నారు.
Read Also: Rakul Preet : ఉక్కపోత పెంచేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..
అయితే, కడపలో రెండుసార్లు మేయర్ పగ్గాలు చేపట్టారు కొత్తమద్ది సురేష్ బాబు.. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో 25 సంవత్సరాల తరువాత టీడీపీ అభ్యర్థి కడపలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.. కడప మున్సిపల్ కార్పొరేషన్లో కడప ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి వచ్చారు. మొదటి సమావేశంలో అంతా సాఫీగానే జరిగింది. రెండవ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నుంచి గోల మొదలైంది.. గత ఏడాది నవంబర్ 7న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదికపైన ఎమ్మెల్యేకి సీటు లేకుండా చేశారు, మేయర్ సురేష్ బాబు.. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి వేదికపై సీటు లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారట.. గత 20 సంవత్సరాలుగా మున్సిపల్ సమావేశ వేదికపై ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించి ఇప్పుడు ఎందుకు సీటు వేయలేదు అంటూ ఆమె మేయర్ ను ప్రశ్నించారు.. ఇక్కడి నుంచి మొదలైన మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవి మధ్య మాటల యుద్ధం ఫిర్యాదుల వరకు వెళ్లింది..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
డిసెంబర్ 18వ తేదీన జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం అత్యంత గందరగోళం మధ్య జరిగింది.. అవినీతి అక్రమాలపై కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలపై ఎమ్మెల్యే మాధవి ఆరోపణల వర్షం కురిపించారు.. అక్రమాలు నిరూపించాలంటూ వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు పోటాపోటీగా నిరసనలు చేపట్టడంతో కార్పొరేషన్ సమావేశం గందరగోళం మధ్య ముగిసింది… అయితే, కడప నియోజకవర్గం మొత్తం కడప కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్న కార్పొరేషన్ రెజల్యూషన్ తప్పనిసరి.. ఎమ్మెల్యే మాధవికి కార్పొరేషన్ పాలకవర్గం సహకరించకపోవడంతో పాటు వేదికపై కుర్చీ వేయకపోవడంతో ఆపరేషన్ వైసీపీకి ఆమె శ్రీకారం చుట్టారట.. ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్ లను టీడీపీలోకి రావడానికి చక్రం తిప్పారట. అంతటితో ఆగకుండా నాకే కుర్చీ లేకుండా చేస్తావా, నీకే కుర్చీ లేకుండా చేస్తా చూడు, అంటూ కార్పొరేషన్ సమావేశంలో చేసిన సవాల్ మేరకు ఆమె ఫిర్యాదులకు తెరలేపారట.. కడప కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు ఎమ్మెల్యే మాధవి ఫిర్యాదు చేయడం.. ఆమె ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టడం.. విజిలెన్స్ విచారణ లోమేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని గుర్తించారట.. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం ప్రజాప్రతినిధులు, వారి పేరున గాని, వారి కుటుంబ సభ్యుల పేరును గాని, కాంట్రాక్టు పనులు చేయకూడదని మీకు తెలియదా ? అంటూ ప్రభుత్వం నీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ మార్చి 28న షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగిపోయాయి..
Read Also: IPL 2025: ఆర్సీబీ ‘మంత్రం’.. టైటిల్ కోసమేనా..
ఇక, షోకాస్ నోటీసుకు 15 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొంది మున్సిపల్ శాఖ.. ఈ నోటీస్ పై మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.. సమాధానం ఇవ్వడానికి గడువు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు.. రెండుసార్లు గడువు పెంచిన హైకోర్టు.. మూడోసారి విచారణ హాజరుకావాలని ఆదేశించింది… అయితే, నిన్న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరుకావాలని మేయర్ సురేష్ బాబుకు నోటీసు జారీ చేశారు… ఇందులో భాగంగా ఆయన మంగళవారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎదుట హాజరు అయ్యారు… మేయర్ సురేష్ బాబుకు కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు ఆయన పదవికే ఏసురు తెచ్చిపెట్టింది . కడప కార్పొరేషన్ లో మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించిన వ్యవహారం ఇప్పుడు ఆయనకే కుర్చీ లేకుండా చేసింది… వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థ గుత్తేదారులు మేయర్ కుటుంబ సభ్యులుగా గుర్తిస్తూ ప్రభుత్వానికి నివేదికలు అందాయి.. వర్ధిని సంస్థలో కొత్తమద్ది అమరేష్, కొత్తమద్ది జయశ్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నారట.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో వర్ధిని సంస్థ చేపట్టిన కాంట్రాక్ట్ పనుల జాబితాను విజిలెన్స్ నివేదిక ద్వారా ప్రభుత్వం సేకరించిందట.. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 క్లాసెస్ 22 (1) ప్రకారం మేయర్ నేరుగా గాని, కుటుంబ సభ్యుల ద్వారా గాని కార్పొరేషన్ కాంట్రాక్టు పనులు చేయడం నిబంధనలకు విరుద్ధం. మున్సిపల్ యాక్ట్ నిబంధనలను అతిక్రమిస్తే ప్రజా ప్రతినిధులు వారి పదవులకు అనర్హులు అవుతారు. ఈ అంశంపై మేయర్ తగిన ఆధారాలతో సమాధానం ఇవ్వాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ నెల 9వ తేదీన నోటీస్ జారీ చేశారు.. మంగళవారం సాయంత్రం మూడు గంటలకు తన ఎదుట హాజరుకావాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కోరారు. మేయర్ సురేష్ బాబు ఇచ్చిన సంజాయిషీ పై సంతృప్తి చెందని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆయనపై అనర్హత వేటు వేశారు…