గురజాల అభివృద్ధిపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అంటూ గురజాల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్ విసిరారు. గురజాలలో టీడీపీ ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి. దాచేపల్లి నడిసెంటర్లో అయినా సరే, బొడ్రాయి సెంటర్ లో అయినా సరే, చర్చకు నేను ఒక్కడినే వస్తా, లెక్కలు తేల్చుకొని వెళ్తా, టీడీపీ వారు సిద్ధమా’ అంటూ ఛాలెంజ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, మేము నిజంగా అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు వేయగలరా అని ప్రశ్నించారు. ఓడిపోతుందని తెలిసి అరిగిపోయిన రికార్డులా చెప్పిందే రిపీట్ చేస్తున్నారని, చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో గురజాల నియోజక వర్గంలో అభివృద్ధి చేయలేదని, ప్రజాస్వామ్యంలో చర్చ జరిగితేనే ఎవరు ఎలాంటి అభివృద్ధి చేసింది ప్రజలకు అర్థం అవుతుందని మహేష్ రెడ్డి అన్నారు.