GVMC: కొద్దిగంటలు మాత్రమే సమయం…! నెలరోజుల ఉత్కంఠకు తెరపడుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై అధిపత్యం ఎవరిదో తేలిపోతుంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేయగా ముగ్గురు జనసేనాలో చేరిపోయారు. మాజీమంత్రి అవంతి కుమార్తె ప్రియాంక సైతం కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చేరికలు అన్నీ తమకు ప్లస్ అనుభవిస్తున్న టీడీపీ.. ఆఖరి నిముషంలో ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే అవిశ్వాసం నెగ్గడం ఎలా…? అనే తర్జనభర్జనల్లో వుంది.
మలేషియా క్యాంపు నుంచి వచ్చే కార్పొరేటర్ లను నేరుగా భీమిలి రిసార్ట్ కు తరలిస్తుంది. అక్కడి నుంచే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి నేరుగా కౌన్సిల్ సమావేశానికి రప్పించాలనేది టీడీపీ ఆలోచన. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేయర్ పీఠం కూటమి కైవసం కావడం ఖాయం అనే ధీమా ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది. ఫ్యాన్ సింబల్ పై గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. వీళ్ళలో 25 మంది పార్టీ ఫిరాయించగా అనర్హత వేటుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న కార్పొరేటర్లకు నేరుగాను… క్యాంపులకు వెళ్లిపోయిన వాళ్ళ కు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసింది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని బలంగా విశ్వశిస్తున్న వైసీపీ… ఈ వ్యవహరం అంతా ముగిసే వరకు కార్పొరేటర్ లను క్యాంప్ లోనే కొనసాగాలని నిర్దేశించింది. ఇప్పటికే కూటమి వైసీపీ సభ్యులపై ఆకర్ష కొనసాగిస్తుండగా.. ప్రతిపక్షం సైతం అధికార పార్టీ వైపు ఉన్న ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు వెనక్కి వస్తారని అంచనాలో ఉంది. ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురిచేయడం ద్వారా పెంచుకున్న బలంతో ఓటమి దౌర్జన్యాలకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపణ.
అవిశ్వాసం పై వైసీపీ, కూటమి పార్టీలు ప్రతిష్టకు పోవడం., సంఖ్యాబలం విషయంలో ఊగిసలాట కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. కేవలం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా ఇతరులు ఎవరు జీవీఎంసీ చుట్టుపక్కల లేకుండా చర్యలు తీసుకుంతోంది. 300 మందికి పైగా పోలీసులను భద్రతకు వినియోగించాలని నిర్ణయించారు. సమావేశ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల సర్వేలెన్సులో ఉండేలా జాగ్రత్తలు పాటించారూ.