రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రిపోర్టులోని అంశాలను ఆయన వెల్లడించారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ. మేర పెరిగిన అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉందని ఆయన తెలిపారు.
Read Also: ఏపీ ఉద్యోగుల HRA పెంపుపై తెగని పంచాయతీ
అటవీ విస్తీర్ణంలో ఏపీలో గరిష్టంగా 647 చ.కి.మీ మేర పెరుగుదల నమోదయిందని ఆయన పేర్కొన్నారు. తర్వాతి స్థానాల్లో తెలంగాణలో 632 చ.కి.మీ. మేర అటవీ విస్తీర్ణంలో పెరుగుదల నమోదయిందన్నారు. ఒడిశాలో 537 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం పెరిగిందని మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణం పెరగడానికి దోహదపడింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుంది. చాలా గ్రామాల్లో చెట్లను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ ఏడేళ్లలో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణంలో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది.