సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.46,470 టికెట్లలో లక్కీ డిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించారు. ముందువచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు జారీ చేస్తున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు జూన్ 29వ తేదీ సాయంత్రం 4గంటలకు విడుదల అవుతాయని అధికారులు తెలిపారు.
మరోవైపు శ్రీవారి ఆర్జిత సేవల కోసం లక్కీడిప్ టిక్కెట్ల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్సైట్లో లక్కీడిప్ టికెట్ల కోసం భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. లక్కీడిప్ ద్వారా ఎంపికైన భక్తుల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు.టికెట్లు పొందిన వారు రెండ్రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం అందుతోంది.